పారిశ్రామిక రంగాలకు ఊతం
గుంటూరు, ఆగస్టు 7:
గుంటూరు–అమరావతి రోడ్డులోని బండ్లమూడి గార్డెన్స్లో నిర్వహిస్తున్న బీ2 ఎక్స్పో–2026 ఈరోజు అత్యంత వైభవంగా ప్రారంభమైంది. వ్యాపార, వైద్య, విద్య, పారిశ్రామిక, సేవా రంగాలకు చెందిన 160కు పైగా స్టాల్స్ ఈ ఎక్స్పోలో ఏర్పాటు చేయగా, వేలాది మంది సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమాన్ని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ మహమ్మద్ నజీర్ ముఖ్య అతిథిగా ప్రారంభించారు. అనంతరం రోటరీ జిల్లా గవర్నర్ శ్రీ వడ్లమాని రవి వివిధ స్టాల్స్ను ప్రారంభించి సందర్శించారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ బి.వి. సుబ్బారావు, ఐడీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. ఎస్. రఘు, ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ మరియు హెచ్సి అండ్ హెచ్ఎస్ కౌన్సిల్ అధ్యక్షులు శ్రీ శివరాం ప్రసాద్, శ్రీ లక్ష్మీపతి, శ్రీ రామచంద్ర రాజు, డా. ఎస్.ఎస్.వి. రమణ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ మహమ్మద్ నజీర్ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం అనంతరం దేశంలోని అనేక చిన్న పట్టణాలు అభివృద్ధి చెంది నేడు స్మార్ట్ సిటీలుగా రూపాంతరం చెందాయని అన్నారు. ఒకప్పుడు ప్రముఖ నగరంగా వెలుగొందిన గుంటూరు ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదని పేర్కొన్నారు. గుంటూరులోని వ్యాపార, పారిశ్రామిక, సేవా రంగాల సామర్థ్యాన్ని ప్రజలకు పెద్ద ఎత్తున పరిచయం చేయడానికి బీ2 ఎక్స్పో వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎక్స్పోను విజయవంతంగా నిర్వహించిన బీ2 ఎక్స్పో అధ్యక్షులు శ్రీ కుమ్మమూరు శ్రీధర్, శ్రీ హేమంత్తో పాటు నిర్వహణలో కృషి చేసిన ప్రతి ఒక్కరినీ ఎమ్మెల్యే అభినందించారు.
ఈ సందర్భంగా ధృతి హాస్పిటల్స్కు చెందిన డా. హరికృష్ణ యువతను ఒక వేదికపైకి తీసుకువచ్చి, వారి సహకారంతో ఇంత పెద్ద కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఎక్స్పోలు మరిన్ని నిర్వహించి గుంటూరు అభివృద్ధికి దోహదపడాలని ఆకాంక్షించారు.
వ్యాపార, వైద్య, విద్య, సాంకేతిక, సేవా రంగాలకు చెందిన ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, యువ పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, ప్రజలు భారీ సంఖ్యలో హాజరై స్టాల్స్ను సందర్శించారు. ఆధునిక ఉత్పత్తులు, వైద్య సేవలు, సాంకేతిక ఆవిష్కరణలు, స్టార్టప్లు, విద్యా సంస్థల ప్రదర్శనలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
కార్యక్రమం విజయవంతం కావడంలో నిర్వహణ కమిటీ సభ్యులు విశేష కృషి చేశారు. ముఖ్యంగా శ్రీ గంగాధర్ (బ్రాహ్మణ కార్పొరేషన్ సభ్యులు), శ్రీ ఎ.వి. రమణమూర్తి, శ్రీ రవిశంకర్తో పాటు వివిధ విభాగాల కమిటీ సభ్యులు సమన్వయంతో వ్యవహరిస్తూ ఎక్స్పోను అత్యంత విజయవంతంగా నిర్వహించారు. కార్యక్రమ నిర్వహణలో వారి సేవలను పలువురు ప్రముఖులు ప్రత్యేకంగా అభినందించారు.
గుంటూరులో వ్యాపార, పారిశ్రామిక, సేవా రంగాల అభివృద్ధికి దోహదపడే వేదికగా నిలిచిన బీ2 ఎక్స్పో–2026 రానున్న రోజుల్లో కూడా సందర్శకులకు ఆకర్షణీయమైన ప్రదర్శనలు, వ్యాపార అవకాశాలు, నెట్వర్కింగ్ కార్యక్రమాలతో కొనసాగనుంది.