స్పైసెస్ బోర్డు సభ్యుడు కె.వి. సుబ్బారావు తో ప్రత్యేక ఇంటర్వ్యూ
స్పైసెస్ బోర్డు సభ్యుడు కె.వి. సుబ్బారావు తో ప్రత్యేక ఇంటర్వ్యూ
అరకు, జూలై 31:
ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు–పాడేరు ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన రైతులు సుగంధ ద్రవ్యాల సాగులో విశేష ప్రగతి సాధిస్తున్నారని స్పైసెస్ బోర్డు సభ్యుడు కె.వి. సుబ్బారావు తెలిపారు. ఇటీవల అరకు, పాడేరు ప్రాంతాలను సందర్శించిన ఆయన, గిరిజన రైతులతో సమావేశమై సాగు విధానాలు, ఎగుమతులు, ప్రభుత్వ సహాయం తదితర అంశాలను పరిశీలించారు.
ఆయన భారతీయం తెలుగు వార్తలుకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

అరకు కాఫీకి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ
అరకు ప్రాంతంలో పండించే కాఫీ నాణ్యత అత్యంత ఉన్నతంగా ఉంటుందని సుబ్బారావు తెలిపారు. ఇక్కడ పండే కాఫీకి దేశీయంగానే కాకుండా విదేశీ మార్కెట్లలో కూడా మంచి డిమాండ్ ఉందన్నారు.
“అరకు కాఫీ అత్యుత్తమ నాణ్యత కలిగి ఉంటుంది. అందుకే విదేశాలకు కూడా పెద్ద ఎత్తున ఎగుమతి అవుతోంది. స్థానికంగా వచ్చే పర్యాటకులు కూడా కేజీలు, రెండు కేజీల చొప్పున కొనుగోలు చేస్తుంటారు. వ్యాపారులు పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి గుంటూరు, విజయవాడ వంటి నగరాలకు పంపించి రీప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నారు” అని వివరించారు.

అంతర పంటలతో రైతులకు అధిక ఆదాయం
ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన రైతులు ఒకే తోటలో మిరియాలు, కాఫీ, ఇతర పంటలను అంతర పంటలుగా సాగు చేస్తున్నారని తెలిపారు. ఈ విధానం ద్వారా ఏడాది పొడవునా రైతులకు ఆదాయం లభిస్తోందన్నారు.
ప్రభుత్వ సబ్సిడీతో ఆధునిక యంత్రాలు
స్పైసెస్ బోర్డు ద్వారా గిరిజన రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్రాలను భారీ సబ్సిడీపై అందిస్తున్నట్లు సుబ్బారావు వెల్లడించారు.
అందిస్తున్న యంత్రాలలో:
- మిరియాల ప్రాసెసింగ్ యంత్రాలుk
- ధాన్యాలు, పప్పుధాన్యాల శుద్ధి యంత్రాలు
- పసుపు నాణ్యత పెంచే ప్రాసెసింగ్ పరికరాలు
వ్యక్తిగత రైతులకు 90 శాతం సబ్సిడీ, రైతు సంఘాలు లేదా అసోసియేషన్లకు 75 శాతం వరకు సబ్సిడీ అందజేస్తున్నామని తెలిపారు.

మార్కెటింగ్ సమస్య లేదు
గిరిజన రైతులు పండిస్తున్న సుగంధ ద్రవ్యాలకు మార్కెటింగ్ సమస్య లేదని సుబ్బారావు స్పష్టం చేశారు.
“ఉత్పత్తి సిద్ధమైన వెంటనే వ్యాపారులు నేరుగా వచ్చి కొనుగోలు చేస్తున్నారు. మంచి నాణ్యత ఉన్న ఉత్పత్తి కావడంతో మార్కెటింగ్ కోసం ప్రత్యేకంగా ప్రయత్నించాల్సిన అవసరం రావడం లేదు” అని చెప్పారు.
అధిక దిగుబడినిచ్చే కొత్త మిరియాల రకాలు
రైతుల ఆదాయం పెంచేందుకు అధిక దిగుబడినిచ్చే కొత్త మిరియాల రకాలను ప్రోత్సహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
సాధారణంగా ఒక మిరియాల చెట్టు నుంచి 15 కిలోల వరకు దిగుబడి వస్తుండగా, కొత్త రకాలతో 18 నుంచి 20 కిలోల వరకు దిగుబడి లభిస్తోందన్నారు.
మూడు సంవత్సరాల్లో పంట… 40 ఏళ్ల వరకు ఆదాయం
మిరియాల మొక్క నాటిన తర్వాత మూడు సంవత్సరాలకు దిగుబడి ప్రారంభమవుతుందని, ఒకసారి స్థిరపడిన తర్వాత సుమారు 40 సంవత్సరాల వరకు నిరంతర దిగుబడి ఇస్తుందని సుబ్బారావు తెలిపారు.
“దీంతో రైతులు తరచూ కొత్త పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉండదు. దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయం లభిస్తుంది” అని పేర్కొన్నారు.

కాఫీ బోర్డులు – స్పైసెస్ బోర్డు సేవలు
అరకు–పాడేరు ప్రాంతంలో కాఫీ అభివృద్ధికి అనేక కాఫీ బోర్డు కార్యాలయాలు పనిచేస్తున్నాయని, స్పైసెస్ బోర్డు కూడా పాడేరు కేంద్రంగా గిరిజన రైతులకు సాంకేతిక సహాయం, శిక్షణ, సబ్సిడీలు, నాణ్యత మెరుగుదల కార్యక్రమాలు అందిస్తోందని వివరించారు.

గిరిజన ఆర్థికాభివృద్ధికి సుగంధ ద్రవ్యాల సాగు కీలకం
అరకు–పాడేరు ప్రాంతంలో కాఫీ, మిరియాలు, పసుపు వంటి సుగంధ ద్రవ్యాల సాగు గిరిజన కుటుంబాలకు స్థిరమైన ఆదాయ వనరుగా మారిందని కె.వి. సుబ్బారావు తెలిపారు. ప్రభుత్వ ప్రోత్సాహం, సబ్సిడీలు, అధిక నాణ్యత గల ఉత్పత్తులు, ఎగుమతి అవకాశాలు కలిసి ఈ ప్రాంత గిరిజన రైతుల జీవనోపాధిని మరింత బలోపేతం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.