గుంటూరు అరండల్పేటలోని యోగి భవన్ లో ఆదివారం మే 17 సాయంత్రం 6 గంటలకు ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్లలో ఆర్థోపెడిక్ సమస్యలపై అవగాహన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, జాయింట్ రీప్లేస్మెంట్ నిపుణులు డా. ఎం. వినోద్ కుమార్ గారు (అమృత హాస్పిటల్స్) ముఖ్య అతిథిగా హాజరై, సుమారు 40 మంది పాల్గొన్నవారికి విలువైన ఆరోగ్య సూచనలు అందించారు.
ఆస్టియోపోరోసిస్ అంటే ఏమిటి? ఆస్టియో ఆర్థ్రైటిస్ ఎందుకు వస్తుంది? ఎముకలను బలంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి? వంటి అనేక ప్రశ్నలకు సమగ్రంగా సమాధానాలు ఇచ్చారు.

కార్యక్రమం ప్రారంభంలో డా. పృథ్వీరాజు గారు ఓంకారంతో కార్యక్రమాన్ని ప్రారంభించగా, అనంతరం డా. శ్రీనివాస్ రెడ్డి గారు ఆరోగ్య భారతి సంస్థ గురించి పరిచయం చేశారు.
తదుపరి డా. కాకాని పృథ్వీరాజు గారు ఆరోగ్యకరమైన జీవనశైలిపై మాట్లాడుతూ, ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే భోజనం చేయడం, ప్రతిరోజూ వ్యాయామం, సమయానికి నిద్ర, యోగా, ప్రాణాయామం, ధ్యానం వంటి అలవాట్లు ఆరోగ్యాన్ని కాపాడుతాయని వివరించారు. మన జీవితంలో ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, వ్యాయామం లోపం వలన బీపీ, షుగర్, ఒబేసిటీ వంటి సమస్యలు వస్తాయని తెలియజేశారు.

కార్యక్రమం ముగింపులో స్నేహ పరిమళం కు చెందిన పూర్వాశ్రమ మెడికల్ రెప్రజెంటేటివ్స్ బృందం , మెడికల్ రంగంపై సానుకూల దృక్పథంతో సేవలందిస్తున్న డా. వినోద్ కుమార్ గారిని ఘనంగా సన్మానించారు.
అనారోగ్యంతో బాధపడుతున్న పింగళి రాజేశ్వర రావు అనే ఒక మెడికల్ రిప్రజెంటేటివ్కు 15 రోజులపాటు ఐసీయూలో ఆర్థిక లాభాపేక్ష లేకుండా చికిత్స అందించిన ఆయన సేవాభావాన్ని అందరూ ప్రశంసించారు.
జై హింద్ , జై భారత్ ,



