పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలంలోని ఘనసర గ్రామంలో గ్రామీణ వికాస్ సంఘం ఆధ్వర్యంలో ఆరోగ్య అవగాహన సదస్సు ఏప్రిల్ 26న ఘనంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ వైద్యులు డాక్టర్ కె. సుబ్రమణ్యం గారు (MBBS, MD, DM – cardiology) ఆరోగ్య భారతి రాష్ట్ర సభ్యులు మరియు డాక్టర్ శ్రీ తిరుపతి రావు గారు (DHMS, MD హోమియో) హాజరయ్యారు. గ్రామీణ వికాస్ సంఘ అధ్యక్షులు గుడ్ల సత్యారావు గారి అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు .
ఈ సందర్భంగా వారు గ్రామ ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ, సాధారణ జీవనశైలి మార్పులతో అనేక వ్యాధులను నివారించవచ్చని వివరించారు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ, సమయానికి నిద్ర వంటి అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు.
డాక్టర్ కె. సుబ్రమణ్యం గారు మాట్లాడుతూ, అధిక రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులు గ్రామీణ ప్రాంతాల్లో కూడా వేగంగా పెరుగుతున్నాయని, వీటిని నియంత్రించడానికి సరైన జీవన విధానం అవసరమని తెలిపారు. ఆయన సుమారు 75 మందికి పైగా గ్రామస్తులను పరీక్షించి, అవసరమైన వైద్య సలహాలు అందించారు.

అలాగే డాక్టర్ తిరుపతి రావు గారు హోమియోపథీ ద్వారా సాధారణ వ్యాధులను ఎలా నియంత్రించవచ్చో వివరించారు.
ఆరోగ్య సూచనలు:
ఈ సందర్భంగా వైద్యులు ఇచ్చిన ముఖ్య సూచనలు ఇవి:
- అవసరం లేకుండా యాంటీబయోటిక్స్ వాడకూడదు
- కోల్డ్ డ్రింక్స్ మరియు జంక్ ఫుడ్కు దూరంగా ఉండాలి
- బీపీ, షుగర్ వంటి వ్యాధులను చెక్ చేసుకోవాలి
- పాలు మరియు బియ్యాన్ని తగ్గించి, మిల్లెట్స్ వంటి ఆహారాన్ని వాడాలి
- వ్యాయామం, యోగా మరియు ప్రాణాయామం చేయాలి
- మంచి ఆహారపు అలవాట్లు పాటించాలి
ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు ఉత్సాహంగా పాల్గొని, వైద్యుల సూచనలను ఆసక్తిగా ఆలకించారు. గ్రామీణ వికాస్ సంఘం చేపట్టిన ఈ కార్యక్రమం గ్రామ ప్రజల ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంలో ఎంతో ఉపయోగకరంగా నిలిచింది.


