అయోధ్య:
అయోధ్య రామమందిరంలో పూజా విధానాలను రామానందాచార్య సంప్రదాయం, ప్రాచీన వైష్ణవ ఆచారాలకు అనుగుణంగా మరింత క్రమబద్ధీకరించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా పూజారుల వస్త్రధారణలో మార్పులు చేయాలని నిర్ణయించారు.
ఇకపై గర్భగుడిలోకి ప్రవేశించే సమయంలో పూజారులు కుట్టని పసుపు రంగు వస్త్రాలు ధరించనున్నారు. ముఖ్యంగా సిల్క్తో తయారు చేసిన కుట్టని ఉత్తరీయాన్ని ధరించే విధానాన్ని అమలు చేయనున్నారు. శీతాకాలంలోనూ ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ కుట్టని ఉన్ని వస్త్రాలను ఉపయోగించనున్నారు.
రామమందిరంలో ప్రాణ ప్రతిష్ఠ అనంతరం పూజారులు చౌబందీ (కుర్తా) ధరించే విధానం అమల్లో ఉంది. తాజాగా ఆలయ పూజా వ్యవస్థను ప్రాచీన సంప్రదాయాలకు అనుగుణంగా రూపొందించేందుకు నిబంధనలను పునఃసమీక్షిస్తున్నారు.
పూజారులకు ప్రత్యేక నియమావళి
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు మతపరమైన కమిటీ సమావేశంలో పూజారుల నియామకం, ఆచరణ, రోజువారీ విధులు, పూజా విధానం, స్వామివారి అలంకరణ, నైవేద్యం, హారతి తదితర అంశాలపై చర్చించారు.
ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాలను సమీక్షించి, ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగా శాశ్వతమైన, క్రమబద్ధమైన పూజా విధానాన్ని రూపొందించేందుకు నియమావళి ముసాయిదాపై కమిటీ చర్చించింది. త్వరలో నిబంధనలను ఖరారు చేసి నిత్యపూజల్లో అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.
పూజారుల వస్త్రధారణపై కమిటీ సభ్యుడు రాజ్కుమార్ దాస్ మాట్లాడుతూ, పూజారులు సిల్క్తో తయారైన కుట్టని ఉత్తరీయాన్ని ధరించనున్నట్లు తెలిపారు. శీతాకాలంలో కుట్టని ఉన్ని వస్త్రాలను ఉపయోగిస్తారని వెల్లడించారు.
ఆలయ నిర్వహణపై భిన్నాభిప్రాయాలు
రామమందిర నిర్వహణకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)ను నియమించాల్సిన అవసరం లేదని మతపరమైన కమిటీ సభ్యుడు మహంత్ మిథిలేశ్ నందినీ శరణ్ అభిప్రాయపడ్డారు. అయితే ప్రభుత్వం లేదా ట్రస్టు అలాంటి నియామకం చేపడితే తాను వ్యతిరేకించబోనని స్పష్టం చేశారు.
ఆలయ నిర్వహణలో ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఆలయాలు, మఠాలు, ఆశ్రమాల సంప్రదాయాలతో అనుబంధం ఉన్నవారికి నిర్వహణలో ప్రాధాన్యత కల్పించాలని ఆయన సూచించారు.
ఆగస్టు 15 నుంచి 12 రోజుల ఝూలనోత్సవం
అయోధ్య రామమందిరంలో ఆగస్టు 15 నుంచి 12 రోజుల పాటు ఝూలనోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవం తొలి రోజు ఉత్తర ద్వారం నుంచి రామ్లల్లా ఉత్సవ విగ్రహంతో పల్లకీ యాత్ర చేపట్టనున్నారు.
ఈ యాత్ర ఆలయ ప్రధాన ద్వారం, ప్రాకార ప్రాంతం మీదుగా కుబేర్ టీలా వరకు కొనసాగనుంది. అక్కడ ప్రత్యేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఉత్సవ విగ్రహాన్ని తిరిగి ఆలయానికి తీసుకురానున్నారు. అనంతరం రామ్లల్లాను బంగారు అలంకరణతో కూడిన వెండి ఉయ్యాలలో ఆశీనులను చేయనున్నారు.
కుబేర్ టీలా వద్ద ప్రత్యేక దర్శనం
ఝూలనోత్సవం తొలి రోజు రామ్లల్లా కుబేర్ టీలా వద్ద ఝూలాలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉదయం శృంగార హారతి అనంతరం స్వామివారిని ఉయ్యాలలో ఆశీనులను చేస్తారు. మధ్యాహ్నం భోగ సమర్పణ సమయంలో కొద్దిసేపు దర్శనం నిలిపివేసి, అనంతరం తిరిగి భక్తులకు దర్శనం కల్పించనున్నారు.
మల్పువా, పూరీ, ఖీర్ వంటి సంప్రదాయ వంటకాలను నైవేద్యంగా సమర్పించనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఉదయం నుంచి సాధ్యమైనంత ఎక్కువ సమయం ఝూలా దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం శయనకాలంలోనూ రామ్లల్లాను ఝూలాలో దర్శించుకునే అవకాశం కల్పించనున్నారు. అయోధ్యలోని సాధువులు, సంతులను కూడా ఈ ఉత్సవానికి ముందుగానే ఆహ్వానించనున్నారు. రామమందిర ట్రస్టు, మతపరమైన కమిటీ సభ్యులు ఆలయ పరిసరాలను పరిశీలించి, పల్లకీ యాత్ర, కుబేర్ టీలా వద్ద అలంకరణ, భక్తుల దర్శన ఏర్పాట్లు, పూజారులకు కల్పించే సౌకర్యాలపై చర్చించారు.