గుంటూరు:
గణేశ ఉత్సవ సమితి గుంటూరు ఆధ్వర్యంలో నగర సమావేశం శనివారం నిర్వహించారు. నగర అధ్యక్షులు పుణుగుళ్ళ రవిశంకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 42 మంది పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా గణేశ ఉత్సవ సమితి రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శి రంగావజ్జుల లక్ష్మీనాథ్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారు డాక్టర్ కాకాని పృథ్వీరాజ్, ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యవాహ శ్రీ మాధవరెడ్డి, విభాగ్ ప్రచారక్ శ్రీ గౌతమ్, జిల్లా గణేశ ఉత్సవ సమితి కార్యదర్శి శ్రీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సింగిల్ విండో విధానంలో అనుమతులు
నగర అధ్యక్షులు రవిశంకర్ మాట్లాడుతూ, ఈ ఏడాది గణేశ ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వంతో కలిసి ప్రత్యేక ఏర్పాట్లపై చర్చించినట్లు తెలిపారు. ఉత్సవ మండపాలకు అవసరమైన అనుమతులు సింగిల్ విండో విధానంలో, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పర్మిషన్ అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
నగరంలోని సుమారు 30 కేంద్రాల్లో కార్యకర్తలను అందుబాటులో ఉంచి, మండపాల నిర్వాహకులకు నమోదు ప్రక్రియలో సహకరించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. గుంటూరు నగరంలో సుమారు వెయ్యి మండపాలకు అనుమతులు సజావుగా లభించేలా ఈ సంవత్సరం వాటిని సమన్వయ పరిచేలా కృషి చేస్తున్నామని చెప్పారు.
స్వామి థియేటర్ ప్రాంతంలో రోల్ మోడల్ మండపం

గుంటూరు నగరంలో గణేశ ఉత్సవాలను ఆదర్శంగా నిర్వహించేందుకు స్వామి థియేటర్ ప్రాంతంలో ప్రత్యేకంగా మట్టి గణేశ విగ్రహంతో మండపాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు రవిశంకర్ తెలిపారు. ఉత్సవ ప్రారంభం నుంచి నిమజ్జనం వరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు సమన్వయంతో చేపట్టనున్నట్లు చెప్పారు.
సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యం

రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శి రంగావజ్జుల లక్ష్మీనాథ్ మాట్లాడుతూ, బాల గంగాధర్ తిలక్ ప్రారంభించిన గణేశ ఉత్సవాల ప్రధాన ఉద్దేశం హిందువుల్లో ఐక్యత, క్రమశిక్షణను పెంపొందించడం, స్వాతంత్ర్యోద్యమానికి ప్రజలను సమీకరించడం అని తెలిపారు.
ఆ స్ఫూర్తితో దేశంలోని అనేక ప్రాంతాల్లో గణేశ ఉత్సవాలు జరుగుతున్నాయని, ఆంధ్రప్రదేశ్లోనూ గత ఏడాది నుంచి సమితి ఆధ్వర్యంలో ఉత్సవాలను ఆదర్శంగా నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.
ఉదయం పూట పూజలు, పారాయణాలు, భజనలు, సాయంత్రం కోలాటాలు, చక్కభజనలు, నృత్య ప్రదర్శనలు, ప్రవచనాలు వంటి ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ఏడు రోజుల ఉత్సవాలైనా, తొమ్మిది రోజుల ఉత్సవాలైనా హిందూ ధర్మాన్ని ప్రతిబింబించేలా కార్యక్రమాలు ఉండాలని తెలిపారు.
స్వామి థియేటర్ ప్రాంతంలో మట్టి విగ్రహంతో పెద్ద ఎత్తున ఉత్సవాలను నిర్వహించి, గణేశ ఉత్సవాలను ఎలా ఆదర్శంగా నిర్వహించవచ్చో ప్రజలకు తెలియజేయడమే లక్ష్యమని పేర్కొన్నారు.

ప్రతి మండపానికి మార్గదర్శకాలు
గణేశ ఉత్సవ సమితి గౌరవ సలహాదారు డాక్టర్ కాకాని పృథ్వీరాజ్ మాట్లాడుతూ, సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరూ సుమారు పది కేంద్రాల బాధ్యత తీసుకుని, ఆయా మండపాల నిర్వాహకులకు సమితి సూచనలను చేరవేయాలని కోరారు.
ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రవచనాలు, పాటలు ఉన్న పెన్డ్రైవ్లను మండపాలకు అందించాలని సూచించారు. ప్రతి మండపంలో ఉదయం, సాయంత్రం నిర్వహించే కార్యక్రమాల సమయాలను డిస్ప్లే బోర్డులో స్పష్టంగా ప్రదర్శించాలని తెలిపారు.
మండపాల వద్ద పరిశుభ్రత, భద్రత, క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రసాద వితరణలోనూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిమజ్జనం రోజున భక్తులు క్రమశిక్షణతో వ్యవహరించేలా ముందస్తు అవగాహన కల్పించాలని కోరారు.
చివరగా శాంతి మంత్రంతో సమావేశం ముగిసింది.
Related Lingks
- https://bharatiyamtelugu.com/chicago-to-madison-square-hindu-thought-vivekananda-mohan-bhagwat/
- https://bharatiyamtelugu.com/aarogya-bharati-healthy-individual-family-society-speech-summary/
- https://bharatiyamtelugu.com/ganesh-utsava-samithi-office-inauguration-guntur-bradipeta/