గుంటూరు, ఆగస్టు 30:
గణేశ ఉత్సవ సమితి గుంటూరు జిల్లా కార్యాలయాన్ని బ్రాడీపేట 8వ వోడ్ రోడ్డులో ఆదివారం ఘనంగా ప్రారంభించారు. గణేశ ఉత్సవ సమితి గుంటూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ మల్లినేని పెరుమాళ్లు ముఖ్య అతిథిగా పాల్గొని కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి పలువురు నగర ప్రముఖులు, గణేశ ఉత్సవ సమితి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులుగా డాక్టర్ మల్లినేని పెరుమాళ్లు, కార్యదర్శిగా నాగేశ్వరరావు, నగర అధ్యక్షులుగా పునుగుల ప్రవీణ్ కుమార్ తదితరులు బాధ్యతలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని గణేశ ఉత్సవ సమితి రాష్ట్ర కార్యదర్శి శ్రీ పాకాల త్రినాథ్ దగ్గరుండి పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా పాకాల త్రినాథ్ మాట్లాడుతూ, గుంటూరు జిల్లాలో ప్రజలు ప్రతి సంవత్సరం గణేశ ఉత్సవాలను ఎంతో భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఉత్సవాల నిర్వహణలో ప్రజలకు, మండపాల నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సహకారం అందించాలనే ఉద్దేశంతో గణేశ ఉత్సవ సమితి జిల్లా కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
గణేశ మండపాల ఏర్పాటు, విగ్రహాల ఎత్తు, విద్యుత్ సరఫరా, ఇతర అనుమతులు తదితర అంశాలపై ఉత్సవ నిర్వాహకులకు అనేక సందేహాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఉత్సవాల సమయంలో ఎదురయ్యే చిన్నచిన్న సమస్యలకు ఎవరిని సంప్రదించాలి, ఎక్కడి నుంచి సహకారం పొందాలి అనే విషయాల్లో నిర్వాహకులకు మార్గనిర్దేశం చేయడం కూడా సమితి ముఖ్య ఉద్దేశాల్లో ఒకటని తెలిపారు.
గణేశ ఉత్సవ సమితి ప్రజలకు, ఉత్సవ నిర్వాహకులకు మరియు ప్రభుత్వ యంత్రాంగానికి మధ్య అనుసంధాన వేదికగా పనిచేస్తుందని పాకాల త్రినాథ్ వివరించారు. ఉత్సవాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ప్రశాంతంగా, సమన్వయంతో మరియు విజయవంతంగా జరిగేలా అవసరమైన సహకారం అందించేందుకు సమితి కృషి చేస్తుందని తెలిపారు.
కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సమితి నాయకులు, కార్యకర్తలు, నగర ప్రముఖులు మరియు పలువురు గణేశ ఉత్సవ నిర్వాహకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
3
/ 100
SEO Score