మంగళగిరి:
మంగళగిరి మండలంలోని మాతృచాయ అనాథ శరణాలయం బాయ్స్ హాస్టల్లో ఆదివారం ఆరోగ్యభారతి ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యభారతి వైద్యుల బృందం శరణాలయంలోని పిల్లలకు సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా అందించింది.

ఈ వైద్య శిబిరంలో సేవాభారతి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బాలాజీ, డెర్మటాలజిస్ట్ డాక్టర్ జి. శిరీషా తదితర వైద్యుల బృందం పాల్గొంది. మొత్తం 51 మంది పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా పిల్లల్లో కనిపిస్తున్న చర్మ సంబంధిత సమస్యలను గుర్తించి, వారికి తగిన మందులు, ఆయింట్మెంట్లు, లోషన్లు, ట్యాబ్లెట్లు అందజేశారు. అలాగే చర్మవ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య సలహాలు ఇచ్చారు.
ఈ సందర్భంగా డెర్మటాలజిస్ట్ డాక్టర్ శిరీషా మాట్లాడుతూ, ఒకే ప్రదేశంలో ఎక్కువ మంది పిల్లలు కలిసి నివసించే పరిస్థితుల్లో ఒకరికి చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అది ఇతరులకు కూడా వ్యాపించే అవకాశం ఉంటుందని తెలిపారు. అందువల్ల ఒక్కొక్కరికి విడివిడిగా చికిత్స చేయడం కంటే, అవసరమైన సందర్భాల్లో అందరికీ సమగ్రంగా పరీక్షలు నిర్వహించి చికిత్స అందించడం మంచిదని సూచించారు. పిల్లలు వారానికి కనీసం ఒకరోజు తప్పనిసరిగా షాంపూతో తలస్నానం చేయాలని, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని సూచించారు.

పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని డాక్టర్ శిరీషా తన క్లినిక్ నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చిన చర్మవ్యాధులకు సంబంధించిన ఆయింట్మెంట్లు, ట్యాబ్లెట్లు, లోషన్లను విస్తృతంగా ఉచితంగా అందించి సేవలందించారు.
అదేవిధంగా సేవాభారతి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బాలాజీ పిల్లలకు జనరల్ హెల్త్ చెకప్ నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులను అందజేశారు. పిల్లల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి, ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమాన్ని డా. కాకాని పృధ్వీ రాజు, ఆరోగ్యభారతి ప్రాంత సంఘటనా కార్యదర్శి పర్యవేక్షించారు. అనాథ శరణాలయంలోని పిల్లలకు వైద్య సేవలు అందించడం పట్ల నిర్వాహకులు, సిబ్బంది ఆరోగ్యభారతి వైద్యుల బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.


