ఖాజీపాలెం, ఆగస్టు 14:
బాపట్ల జిల్లా ఖాజీపాలెంలోని శాయి ఆరోగ్య కేంద్రంలో ఏడాది కాలంలో 150 ప్రసవాలు విజయవంతంగా నిర్వహించిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యురాలు డాక్టర్ గౌతమిని ఘనంగా సన్మానించారు.

హాస్పిటల్ ప్రారంభమైన కొద్దికాలంలోనే ప్రజల ఆదరణ పొందుతూ అనేక కుటుంబాలకు వైద్య సేవలు అందిస్తోందని కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు అభినందించారు. ఆసుపత్రిలో సేవలందిస్తున్న వైద్యులు, సిబ్బందిని కూడా అభినందించారు.
150 ప్రసవాలు.. 150 కుటుంబాల్లో వెలుగు
ఈ కార్యక్రమంలో NRI హాస్పిటల్స్, మంగళగిరి అధినేత శ్రీ నరసనరాజు, రోజువీడు సీట్స్ అధినేత మండవ ప్రభాకర్రావు సతీమణి శ్రీమతి ఆశాప్రియ, హాస్పిటల్ ఇన్చార్జ్ శ్రీ కరుణరాజు, శ్రీ లక్ష్మీపతి, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ క్షేత్ర ప్రచారక శ్రీ భరత్ కుమార్, హాస్పిటల్ సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు.
ఆసుపత్రిలో ప్రసవాలు జరిగిన సుమారు 150 మంది మహిళలను కూడా కార్యక్రమానికి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా శ్రీమతి ఆశాప్రియ మాట్లాడుతూ, ఒక ఆసుపత్రిలో 150 ప్రసవాలు జరిగాయంటే అది కేవలం ఒక సంఖ్య కాదని, 150 కుటుంబాల్లో కొత్త వెలుగును నింపిన సందర్భమని అన్నారు. వైద్య సేవలను మరింత విస్తరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఆదర్శప్రాయమైన ఆసుపత్రిగా తీర్చిదిద్దాలి

శ్రీ భరత్ కుమార్ మాట్లాడుతూ శాయి ఆరోగ్య కేంద్రాన్ని ఒక ఆదర్శప్రాయమైన ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని అన్నారు. ఆసుపత్రిలో జన్మించిన 150 మంది పిల్లలను ఐదేళ్ల తర్వాత ఒకే వేదికపైకి తీసుకువచ్చి వారి కుటుంబాలతో కలిసి ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని సూచించారు.
ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ఉపయోగిస్తున్న పరికరాల గురించి వైద్యులు కార్యక్రమంలో వివరించారు. హాస్పిటల్ ఇన్చార్జ్ శ్రీ కరుణరాజు ఆసుపత్రి ప్రత్యేకతలు, సేవల విధానం గురించి వివరించారు.
వైద్య సేవలను అందిస్తున్న డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది, ఇతర సిబ్బందిని కార్యక్రమంలో అభినందించారు. అనంతరం కార్యక్రమం ముగిసింది.